బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం : ఈటల

-

బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గజ్వేల్‌ బరిలో నిలుస్తున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ను ఓడించి తీరుతానంటూ శపథం చేశారు. ఆ దిశగా ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. 2003లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. మొదట కమలాపూర్ నియోజకవర్గం, ఆ తరువాత హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి మొత్తం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర మంత్రిగా రెండు పర్యాయాలు పని చేశారు. వివిధ కారణాల చేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తరువాత ఈటల రాజేంరద్ బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్)పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తరువాత వరుసగా జరిగిన పరిణామాలతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, కేసీఆర్‌పై పోటీకి సై అనడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీకి దిగుతున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెరముందు ప్రచారం చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు 2023లో అదే పార్టీ గెలుపుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదని, బీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావొద్దన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందన్నారు. తెలంగాణను పరిపాలించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ గత చరిత్ర కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్‌ను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version