ఎడిట్ నోట్: పవన్ పవర్’ఫుల్’..’నిల్’..!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..వారాహితో ప్రజా యాత్ర మొదలుపెట్టారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో జనసేనని బలోపేతం చేయడానికి రంగంలోకి దిగారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే కసితో పవన్ పనిచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మొన్నటివరకు టి‌డి‌పితో పొత్తు గురించి మాట్లాడిన పవన్..పొత్తులు ఎన్నికల ముందు చూసుకుంటామని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే ఎండగట్టడమే తన టార్గెట్ అంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఉమ్మడి  తూర్పు గోదావరి జిల్లాలోని అన్నావరంలో పూజలు నిర్వహించి..ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో రోడ్ షో ఏర్పాటు చేశారు. ఈ రోడ్ షోకు భారీగా జనం వచ్చారు. ఈ రోడ్ షోలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అధికారం అండతో వేలకోట్లు దోచేసి.. అక్రమంగా సంపాదిస్తూ ప్రజలను విభజించి పాలిస్తున్నారని.. ఇవన్నీ చేస్తూ పసిబాలుడిలా అమాయకంగా నవ్వు నటిస్తున్నారని, తాను ఒంటరి వాడినంటున్న జగన్‌ పాపం పసిపిల్లవాడు అంటూ ఎద్దేవాచేశారు.

అటు వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని దారులూ సీఎం జగన్‌ ఇంటివైపే చూపిస్తుంటే ఎవరు పసివాడని ప్రశ్నించారు. మాట్లాడితే క్లాస్‌వార్‌ అంటూ జగన్‌ కబుర్లు చెబుతున్నారని, కులాల మధ్య చిచ్చుపెడుతున్న వ్యక్తి అసలు క్లాస్‌వార్‌ నడుపుతున్నారని,  అధికారం అండతో కోట్ల అవినీతికి పాల్పడుతూ, ఫ్యూడలిస్టిక్‌ మనస్తత్వంతో వ్యవహరిస్తున్న జగన్‌ అసలైన క్లాస్‌వార్‌ నడుపుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో జగన్‌ ప్రభుత్వ అవినీతిపై వచ్చిన ఫిర్యాదుల ఫైళ్లతో తన గది నిండిపోయిందని అన్నారు.

గత ఎన్నికల్లో కుట్ర చేసి తనని రెండుచోట్ల ఓడించారని..ఈసారి ఒక్కచోటే పోటీ చేస్తానని..గెలిచి ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతానని ఎవరు ఆపుతారో చూస్తానని సవాల్ చేశారు. మొత్తానికి జగన్ పవర్ తీసేస్తానని, తాము పవర్ లోకి వస్తామని పవన్ అంటున్నారు. అయితే జగన్ పవర్ తీసే శక్తి పవన్ ఒక్కరికే లేదు..అలాగే ఒక్కరే సొంతంగా పవర్ లోకి రాలేరు. టి‌డి‌పితో కలిస్తేనే అది కాస్త సాధ్య పడుతుంది. లేదంటే పవన్ పవర్ నిల్ గానే మిగులుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version