కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

-

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘లిజియన్‌ ఆఫ్‌ హానర్‌’ దక్కింది. ఆయన ప్రసంగాలు, రచనలకు గుర్తింపుగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. 1802లో నెపోలియన్ దీన్ని నెలకొల్పారు. ‘ఫ్రాన్స్‌తో భారత్‌ సంబంధాలను గౌరవించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా.. ఈ గుర్తింపును పొందడం గౌరవంగా భావిస్తున్నా. నేను ఈ పురస్కారానికి అర్హుడినేనని భావించిన వారికి కృతజ్ఞతలు’ అని శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. 2010లో థరూర్‌కు స్పెయిన్‌ ప్రభుత్వం సైతం ఇదే విధమైన గౌరవం అందజేసింది.

మరోవైపు ఈ పురస్కారం దక్కడంపై శశిథరూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. శశిథరూర్ తిరువనంతపురం నియోజకవర్గానికి వరుసగా మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ హోదాల్లో 23 ఏళ్లపాటు సుదీర్ఘంగా విధులు నిర్వర్తించారు. అనేక పుస్తకాలు రాశారు. అప్పుడప్పుడు తన ట్విటర్‌ పోస్టుల్లో అరుదైన ఆంగ్ల పదాలను వాడుతూ.. నెటిజన్లకు సవాల్‌ విసురుతుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version