పేద కుటుంబాలకు శుభవార్త.. టీటీడీ సామూహిక వివాహాలు

-

టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని నిర్ణయించింది టీటీడీ బోర్డు. పేదింటి పిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఈ ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న రోజుల్లో కళ్యాణమస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారని ఆయన గుర్తు చేశారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని వెల్లడించారు. అర్హులైన వారు తమ తమ జిల్లాల కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే కూడా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వైఎస్సార్‌ తీసుకొచ్చిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఆదేశాలతో పునఃప్రారంభించడం సంతోషంగా ఉన్నదని సుబ్బారెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version