ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనం తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయినా లేదా బాడీ దాన్ని ఎనర్జీగా మార్చడంలో ఫెయిల్ అయినా వచ్చేవే ‘మెటబాలిక్ వ్యాధులు’ ఇటీవల జరిగిన ఒక గ్లోబల్ స్టడీ ప్రకారం, ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారత్, చైనాల్లో ఈ వ్యాధుల భారం విపరీతంగా పెరిగిపోతోందని తేలింది. 2030 నాటికి ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుందని రీసెర్చర్స్ హెచ్చరిస్తున్నారు. అసలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఆ ఐదు ప్రధాన సమస్య ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆసియాపై మెటబాలిక్ వ్యాధుల పంజా: ప్రఖ్యాత ‘మెటబాలిజం’ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం, 1990 నుండి 2023 వరకు ఉన్న డేటాను విశ్లేషిస్తే భారత్, చైనా దేశాల్లో మెటబాలిక్ వ్యాధుల రేటు ఆసియా-పసిఫిక్ రీజియన్లోనే అత్యధికంగా ఉంది. మనం తీసుకునే ఆహారం శరీరంలో విచ్ఛిన్నం కావడం, స్టోర్ అవ్వడం లేదా ఎనర్జీగా మారడం అనే ప్రాసెస్ దెబ్బతిన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి. దీనివల్ల ప్రజల పని సామర్థ్యం తగ్గడమే కాకుండా, అకాల మరణాల ముప్పు కూడా పెరుగుతోంది. రాబోయే 2030 నాటికి ఈ వ్యాధుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఈ స్టడీ అంచనా వేసింది.

మన ఆరోగ్యాన్ని ముంచేస్తున్న ఆ ఐదు గండాలు: పరిశోధకులు ప్రధానంగా ఐదు రకాల రిస్క్ ఫ్యాక్టర్లను గుర్తించారు. అవేంటంటే.. టైప్ 2 డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్ (బీపీ), అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ మరియు కాలేయానికి సంబంధించిన సమస్యలు ఇక వీటిలో ఏ ఒక్కటి ఉన్నా, అది మిగతా సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు, బరువు పెరిగితే ఆటోమేటిక్గా బీపీ, షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మన లైఫ్ స్టైల్ మరియు సరైన ఆహారం లేకపోవడం వల్లే ఈ ఐదు సమస్యలు ఇండియాలో ఒక సైలెంట్ కిల్లర్స్ లా మారిపోతున్నాయి.
రాబోయే కాలంలో సవాలు..: మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 2030 నాటి అంచనాల ప్రకారం, మనం ఇప్పటికైనా మేల్కోకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే మన సంపాదన అంతా ఖర్చయ్యేలా ఉంది. కేవలం మందుల మీద ఆధారపడకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు మరియు చక్కెర వాడకం తగ్గించడం, క్వాలిటీ స్లీప్ మెయింటెన్ చేయడం ద్వారా ఈ మెటబాలిక్ భారం నుంచి మనం బయటపడవచ్చు.
భారత్ లాంటి పెద్ద దేశంలో మెటబాలిక్ వ్యాధులు పెరగడం అంటే అది కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్’ అన్నట్టుగా, జబ్బు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడమే ఉత్తమం. సరైన జాగ్రత్తలతో 2030 నాటి ముప్పును మనం ముందే అడ్డుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా తీవ్రమైన సమస్యలు ఉంటే వెంటనే నిపుణులైన వైద్యుడిని సంప్రదించండి.
