జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఘటన ఒక్కసారిగా యావత్తు భారత్ ను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడి అనంతరం, భారతదేశం పాకిస్తాన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే.. ఈ నేపథ్యంలో, పాక్కు దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్పై కూడా పలు ముఖ్య రాజకీయ నాయకులు, పార్టీలు సమానమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, పాక్-బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పహల్గామ్లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఆ దాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో లష్కరే తోయిబా నేతలు సమావేశమయ్యారు.
బీజేపీ నేత నిషికాంత్ దూబే, లష్కర్-ఎ-తోయిబా నేతలు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకునేందుకు, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను మరింత భద్రతతో పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అలాగే, 1996లో చేసిన గంగా జలాల ఒప్పందాన్ని తప్పుపట్టారు. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం నిలిపివేసినట్లు, బంగ్లాదేశ్తో గంగా జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని అన్నారు.
బీహార్ సీఎం నీతిశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు కూడా ఈ జల ఒప్పందాలను వ్యతిరేకించారని హిమంత బిశ్వ శర్మ చెప్పారు. బ్రహ్మపుత్ర నది నీటిని బంగ్లాదేశ్కు పంపకుండా నిరాకరించారని తెలిపారు. “ఎంతకాలం పాములకు నీళ్లు అందిస్తాం?” అని ప్రశ్నిస్తూ, వాటిని అణిచివేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా పై దేశం నమ్మకం పెట్టుకున్నదని, త్వరగా బంగ్లాదేశ్తో గంగా-బ్రహ్మపుత్ర ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సూచించారు.