భారతీయ రాజుల దగ్గర ఉన్న అరుదైన వజ్రం ‘గోల్కొండ బ్లూ’ వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని మే 14వ తేదీన జెనీవాలో ‘‘క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ సేల్లో వేలం వేయనున్నారు. దాదాపు రూ.430కోట్ల వరకు దీని ధర పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమైనట్లు సమాచారం. పూర్వం ఇందౌర్ను పరిపాలించిన మహారాజా యశ్వంత్ రావు హోల్కర్-ll వద్ద ఉన్న ఈ వజ్రాన్ని మొదట 1923లో మహారాజా తండ్రి దీని్ని ఓ బ్రాస్లెట్లో పొదిగించారు. అనంతరం ఇందౌర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్లో ‘ది గోల్కొండ బ్లూ’ను అమర్చారు. 1947లో ఈ వజ్రాన్ని న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేయగా ఆ తర్వాత అది బరోడా మహారాజు వద్దకు చేరుకుంది. అనంతరం ఇది ఓ ప్రైవేటు సంస్థ వద్దకు చేరింది.