వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతులు నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. వారిని కడప రిమ్స్కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయిందని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.