తెలంగాణ గ్రూప్- 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, ఫలితాలను తక్షణమే నిలిపివేయాలని గ్రూప్ వన్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్- 1 అభ్యర్థులు ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
కేవలం మూడు సెంటర్ల నుంచే వందమందికి పైగా ఎంపికయ్యారని, ఇందులో కచ్చితంగా అక్రమాలు చోటుచేసుకున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మీడియంలో 8 వేల మంది పరీక్ష రాసినా కేవలం 30 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందని వాపోయారు. తెలంగాణలో తెలుగును నిషేధిస్తారా? తెలుగులో రాస్తే ఉద్యోగాలు ఇవ్వరా? అంటూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.