ఝార్ఖండ్ సీఎంపై గవర్నర్ రమేష్‌ బైస్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఝార్ఖండ్ రాజకీయాలపై ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఆటం బాంబు ఏ క్షణమైనా పేలుతుందని వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌.. లాభదాయక పదవి అంశంపై రెండో అభిప్రాయం కోరినట్లు ఆయన చెప్పారు. దీపావళి కోసం సొంతూరు రాయపూర్‌ వెళ్లిన రమేశ్ బైస్‌ ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు మైనింగ్ లీజు కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని బీజేపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గవర్నర్‌ కోరిక మేరకు కేంద్రం ఎన్నికల సంఘం నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. కానీ ఎమ్మెల్యేగా సోరేన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి.

గవర్నర్ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని జేఎంఎం, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని గవర్నర్‌ చెప్పారు. అలాంటి ఉద్దేశమే ఉంటే ఎప్పుడో ఈసీ సిఫార్సు ప్రకారం చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. మళ్లీ రెండో అభిప్రాయం కోరినట్లు తెలిపారు. రెండో అభిప్రాయం వచ్చిన తర్వాత పెద్ద నిర్ణయం ఉంటుందా అని ప్రశ్నించగా బాణాసంచాపై నిషేధం దిల్లీలోనే కానీ ఝార్ఖండ్‌లో కాదన్నారు. ఏదైనా ఒక ఆటం బాంబు పేల వచ్చని గవర్నర్‌ రమేశ్ బైస్‌ చమత్కరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version