బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కారుదిగి కాంగ్రెస్‌లోకి కీలక నేత

-

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల్లో అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి -భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరబోతున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని కుంభం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి…ఆయన్ను తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

దీంతో త్వరలోనే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటికి వెళ్లనున్నారు.భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల వల్ల అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు. 2023 జూలై 24న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అనిల్ కుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఆగస్టులోత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే మరోమారు అవకాశం ఇచ్చారు కేసీఆర్. దీంతో కుంభం అనిల్ తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. అయితే ఆ ప్రచారాన్ని ఖండించినా… తాజాగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version