తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు పై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే.. పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానిని పరిష్కరించేందుకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సీటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన తరుణంలో అసెంబ్లీలో సీఎం మాట్లాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాస్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవరం నడిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవ్వరికీ వ్యతిరేకి కాదు. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి లేఖ రాస్తానని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి.