ప్రేమించలేదని కిరాతకంగా చంపేశాడు.. అంతటితో ఆగకుండా..!

-

చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయితో పరిచయం పడింది. అప్పటి నుంచి ఆమెను ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వెంటపడ్డాడు. తనకి ఇష్టం లేదని ఆమె ఎంత చెప్పినా వేధించడం మానలేదు. చివరకు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెపై పగ పెంచుకున్న ఆ ఉన్మాది.. ఒకసారి మాట్లాడాలని కలుద్దామని తర్వాత తనను ఇబ్బంది పెట్టనని నమ్మబలికాడు. ఈ ఒక్కసారి అతడి మాటలు వింటే తనకు ఈ టార్చర్ తప్పుతుందని భావించి ఆ యువతి అతడి వద్దకు వెళ్లింది. కానీ ఆమెకు పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకోలేకపోయింది.

వనపర్తి జిల్లా మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలంకు 2017లో హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకునే రోజుల్లో కాటేదాన్‌ ఏరియా ఎన్జీవోస్‌కాలనీకి చెందిన సాయిప్రియ (19)తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఈనెల 5న సాయిప్రియకు ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు రావాలని కోరాడు.

అతని మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లగా బైక్‌పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మబ్బుగుట్టల్లోకి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరినా ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీశైలం ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. అనంతరం బంధువు శివ సహకారంతో కేఎల్‌ఐ కాల్వ పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు.

అప్పటికే హైదరాబాద్‌లోని కాటేదాన్‌ ఠాణాలో సాయిప్రియ కనిపించడం లేదని, శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లిదండ్రులు వెంకటేశ్‌, లక్ష్మి ఫిర్యాదు చేశారు. కాటేదాన్‌ పోలీసులు ఆరో తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో రెండు రోజుల తర్వాత నేరం అంగీకరించాడు. వనపర్తి జిల్లా కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసును కాటేదాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version