తెలంగాణ డాక్యుమెంటరీలకు జాతీయ అవార్డులు.. మంత్రి కేటీఆర్‌ హర్షం

-

తెలంగాణలోని వివిధ అంశాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను జాతీయ అవార్డులు వరించడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డీఎస్ఎన్ ఫిల్మ్స్ (DSN Films) ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI ) ఆన్యూవల్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2022 లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోల్‌కతాలో శనివారం నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్‌లో డీఎస్ఎన్ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో అండ్‌ ఎండీ దూలం సత్యనారాయణ ఈ అవార్డులను అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోసం తాము రూపొందించిన ఫిల్మ్క్ కు అవార్డులు ప్రకటించిన జ్యూరీ, పీఆర్సీఐ (PRCI)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డీఎస్ఎన్ ఫిల్మ్స్ సాధిస్తున్న విజయాలకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మద్దతు, ప్రోత్సాహమే కారణమని సత్యనారాయణ పేర్కొన్నారు.

తెలంగాణ బిడ్డగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసే పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ రూపొందించిన వీడియోలతో తెలంగాణలో ఉన్న టూరిజం, ఇతర అంశాలు దేశం దృష్టిని ఆకర్షించినందుకు గర్వంగా ఉందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు దూలం సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక పర్యాటక చిత్రానికి (బుద్ధవనం) క్రిస్టల్‌ అవార్డు, విజనరీ లీడర్‌షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ (సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిశీల తెలంగాణ) చిత్రానికి గోల్డ్‌ అవార్డు, ట్రావెల్, లీజర్, హాస్పిటాలిటీ క్యాంపెయిన్‌పై ( తెలంగాణ టూరిజం సోమశిల టూరిజం సర్క్యూట్) చిత్రానికి గోల్డ్‌, హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ఫిల్మ్‌ (తెలంగాణలో కొవిడ్-19 అవగాహన ప్రచారం)కు గోల్డ్‌, ప్రభుత్వ కమ్యూనికేషన్‌ ఫిల్మ్‌ (రైతుబంధు, రైతుబీమా)కు గాను బ్రాంజ్‌ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై డాక్యుమెంటరీ చిత్రాలు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. సత్యనారాయణ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version