వర్షాకాలం రాగానే కేవలం జలుబు, జ్వరం మాత్రమే వస్తాయని అనుకుంటే పొరపాటే! చలికాలంలో లాగే వర్షాకాలంలో కూడా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల బ్లడ్ ప్రెజర్ (BP) పెరిగే ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైపర్టెన్షన్ సమస్య ఉన్నవారికి ఈ కాలంలో బిపి హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఎక్కువ. మరి వర్షాకాలంలో బీపీ ఎందుకు పెరుగుతుంది? బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
రక్తనాళాలు బిగుసుకుపోవడం: వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల మన శరీరంలోని రక్తనాళాలు బిగుసుకుపోతాయి (సన్నబడతాయి). ఇక దీనివల్ల గుండె శరీరం నలుమూలలకీ రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. ఫలితంగా బ్లడ్ ప్రెజర్ క్రమంగా పెరుగుతుంది.
వర్షాల వల్ల తగ్గే శారీరక శ్రమ:వర్షాల కారణంగా చాలామంది బయటకు వెళ్లలేక వాకింగ్, వ్యాయామాలు మానలేస్తుంటారు.ఇక శారీరక శ్రమ తగ్గడం, రోజంతా ఒకేచోట కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక బీపీ పెరిగే ప్రమాదం ఉంటుంది.

వేడివేడి స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్: వర్షం పడుతుంటే వేడివేడిగా సమోసాలు, బజ్జీలు లేదా ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలనిపిస్తుంది. కానీ, ఆహారంలో ఉప్పు (సోడియం) మోతాదు ఎక్కువైతే బ్లడ్ ప్రెజర్ క్షణాల్లో పెరిగిపోతుంది. కాబట్టి ఉప్పు పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
బిపిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి: హైపర్టెన్షన్ సమస్య ఉన్నవారు వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోనే తరచూ బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక బీపీలో ఏవైనా తేడాలు కనిపించినా, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి.
ఇక వర్షాకాలంలో వాతావరణాన్ని ఆస్వాదిస్తూనే మన ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఉప్పు తగ్గించడం, ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు చేయడం మరియు క్రమం తప్పకుండా బీపీ చెక్ చేసుకోవడం ద్వారా ఈ కాలంలో వచ్చే ముప్పును సులభంగా నివారించవచ్చు!
గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసం అందించిన సాధారణ సమాచారం మాత్రమే. బిపి లేదా ఇతర గుండె సంబంధిత సమస్యలు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి.
