కాపు సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీ పార్టీలో చేరి పవన్ కల్యాణ్పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆయన కూతురు క్రాంతి జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్న ఓ వీడియోను విడుదల చేశారు. అయితే ఈ వీడియో నెట్టింట్లా వైరల్ అయింది.దీంతో తన కుమార్తె వీడియోపై స్పందిస్తూ…’నాకూ, నా కూతురి మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారు. జగన్కు సేవకుడిగా ఉంటా. ఎవరు బెదిరించినా బయపడను.’ అని తెలిపారు.
అయితే ముద్రగడ క్రాంతి వీడియో, పద్మనాభం కామెంట్లపై పవన్ కల్యాణ్ స్పందించారు. ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదని అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఎన్నికల ప్రచారంలోమాట్లాడుతూ.. మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లు అంటూ సీఎం జగన్ పాలనపై సెటైర్లు వేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తులు పెట్టుకున్నామని ,కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని అన్నారు. తుని నుంచి విశాఖకు లోకల్ రైలు సదుపాయం కోసం కృషి చేస్తామని, విద్య, వైద్యం, ఉపాధి, సాగు, తాగునీరు, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.