ముక్కోటి ఏకాదశి… కిక్కిరిసిన దేవాలయాలు !!

-

సోమవారం నేడు ముక్కోటి ఏకాదశి వేడుకలను ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాలలోని అన్ని విష్ణు ఆలయాల్లో భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. ఇక క్షేత్రాల వారీగా చూస్తే… కలియుగ వైకుంఠ తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నానికే భక్తుల రాకతో తిరుమల కిక్కిరిసింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లోని కంపార్ట్‌మెంట్‌లు అన్నీ నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం దాటి భక్తులు క్యూలో నిలబడ్డారు. మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ నిండిపోగా, ద్వాదశి దర్శనానికి సోమవారం మధ్యాహ్నం నుంచి క్యూలైన్‌లోకి అనుమతిస్తామని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం ధనుర్మాస కైంకర్యాల అనంతరం తొలుత వీఐపీలను అనుమతించారు.

తిరుమలలో వీఐపీల సందడి !
తిరుమలలో ముక్కోటి సందర్భంగా శ్రీవారి దర్శనానికి వీఐపీలు పోటెత్తారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌, ఏపీ, తెలంగాణ మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్‌ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆదిమూలపు సురేష్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌, హరీష్‌రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం తర్వాత తెల్లవారుజామున 2 గంటల నుంచి సాధారణ భక్తులకు సర్వ దర్శనాలు ప్రాంరభమయ్యాయి. మరోవైపు, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

నారాయణగిరి ఉద్యానవనంలో సుమారు 30వేల మంది సేదదీరేలా 17 షెడ్లు, మాడవీధుల వెంట సుమారు 24 వేల మంది విశ్రాంతి తీసుకునేలా షెడ్లు వేశారు. గ్యాలరీల్లో మరో 40వేల మంది వరకు, కల్యాణవేదికలో సుమారు 4వేల మంది సేదతీరేలా వసతి కల్పించింది. ఆదివారం మధ్యాహ్నానికి వైకుంఠం క్యూకాంప్లెక్సులోని కంపార్టుమెంట్లు, గ్యాలరీలన్నీ నిండాయి. దాదాపు 90 వేల మందితో అన్ని వసతి కేంద్రాలు నిండిపోవడంతో మధ్యాహ్నం రెండింటి నుంచి క్యూలైన్‌లోకి భక్తులను అనుమతించడం లేదు. షెడ్లలో తలదాచుకున్న సుమారు 60వేల మంది చలికి ఇబ్బంది పడకుండా దుప్పట్లు, పాలు, ఆహారం అందజేసింది. భద్రాచలంలో దక్షిణాది అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

ఉత్తర ద్వార నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్‌ దంపతులు, సత్యవతి రాథోడ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని బాలాజీ టెంపుల్‌, జియాగూడా రంగనాయకస్వామి, చిలుకూరు బాలాజీ, దేవుని అల్వాల, ఉప్పల్‌ కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. యాదాద్రిలో భక్తజన సంద్రం తలపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news