లోక్ సభ ఎన్నికల వేళ ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐకమత్యం లేకపోవడం వల్లే భారత్లో విపక్షాలు బలహీనపడ్డాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కులగణన పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే అని అమర్త్య సేన్ అన్నారు. కానీ, అంతకంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం వంటి అంశాల్లో వెనుకబడిన వారికి మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశ పౌరుడినైనందుకు చాలా గర్విస్తున్నానని తెలిపారు. కానీ, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా చాలా కృషి జరగాలని పేర్కొన్నారు.
మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అమర్త్య సేన్ విమర్శలు గుప్పించారు. భారత్ అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారాయని తెలిపారు. భారత పాలకవర్గం పూర్తిగా ధనవంతుల పక్షానే నిలుస్తోందని ఆరోపించారు.