డిజిటల్ అరెస్టు పేరిట నేరాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్ల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇప్పటివరకు 7.81 లక్షల సిమ్కార్డులను డీయాక్టివేట్ చేసినట్లు చెప్పారు. 83వేల వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. మొత్తం 2,08,469 ఐఎమ్ఈఐలను నిలిపివేసినట్లు వివరించారు.
డిజిటల్ అరెస్టు కోసం వినియోగించే 3,962 కి పైగా స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ముందుగానే గుర్తించి బ్లాక్ చేసిందని బండి సంజయ్ తెలిపారు. I4C నేతృత్వంలో ఏర్పాటైన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు ఇప్పటివరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. దీని ద్వారా దాదాపు రూ. 4,386 కోట్లు కాపాడినట్లు వివరించారు. అన్ని రకాల డిజిటల్ నేరాలకు సంబంధించి ప్రజలు ఫిర్యాదు చేసేందుకు (https://cybercrime.gov.in) సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభించామని బండి సంజయ్ పేర్కొన్నారు.