భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టడం అంత ఈజీగా జరగలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో బిహార్ లోని జేడీయూ, ఏపీలోని టీడీపీ ప్రధాన పాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ రెండు పార్టీలు కనుక ఎప్పుడైనా మధ్యలో వెనకడుగు వేస్తే మోదీ ఇరకాటంలో పడినట్లే. అయితే ఇప్పట్లో ఆయనకు ఆ పరిస్థితి వచ్చేలా కనిపించకపోయినా.. ప్రధాని పోస్టుకు మాత్రం సబార్డినేట్ వస్తారేమో అన్న వార్తలు ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతున్నాయి.
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఉప ప్రధాని కానున్నారా? ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ పీఎంగా నీతీశ్ ఎంపిక లాంఛనమే అనే సంకేతాలిస్తున్నాయి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏకు కూటమి బలపడడానికి నీతీశ్ కుమార్ ఎంతో కృషి చేశారన్న అశ్వినీ కుమార్ చౌబే .. సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆయన ఉప ప్రధానమంత్రి కావాలనేది తన వ్యక్తిగత కోరిక అంటూనే.. అదే జరిగితే బాబు జగ్జీవన్ రామ్ తర్వాత బిహార్ గడ్డపై పుట్టిన రెండో బిడ్డ ప్రధాన మంత్రి గద్దెనెక్కినట్లు అవుతుందని అన్నారు.