కశ్మీర్ గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేస్తూ ఇండియన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? అని ప్రశ్నిస్తూ.. కశ్మీర్ భారత భూభాగం అని తేల్చి చెప్పింది.
ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ అంశంలో మనదేశం ఎప్పటికప్పుడు తన వైఖరిని బలంగా వినిస్తోందని ఆయన తెలిపారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో తమ వైఖరి సరైనదని అన్నారు. ఆ ప్రాంతం తమ జీవనాడి అని.. దాన్ని తాము మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత సర్కార్ స్పందించింది. కశ్మీర్ భారత భూ భాగం అని మరోసారి తేల్చి చెప్పింది.