తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసేందుకు వైస్సార్సీపీ నేతలు కంకణం కట్టుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. టీటీడీ పాలకవర్గాన్ని అవమానిస్తూ దూషించడమే వారు పనిగా పెట్టుకున్నారని.. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వడం మానేసి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు.
వైఎస్సార్సీపీ నాయకులు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని మంత్రి ఆనం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఒక రకంగా.. ముక్కోటి ఏకాదశి సమయంలో మరో విధంగా, ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామివారి కల్యాణం సందర్భంగా.. ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి అనవసర విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆనం మండిపడ్డారు. ఇప్పుడు గోశాలపై పడ్డారని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారని అర్థమవుతోందని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. గోశాలలో కొన్నిసార్లు గోశాలలో సహజ మరణాలుంటాయని.. వాటిని కూడా పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.