పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని గురించి కేవలం పాక్ , భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇదిలాఉండగా, ఆపరేషన్ సింధూర్ గురించిన వివరాలను రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.తొలిసారిగా ఆర్మీ ఆపరేషన్ను ఇద్దరు మహిళా ఆఫీసర్లు వివరించారు. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగిందని.. కేవలం 25 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడి చేసినట్లు రక్షణ శాఖ అధికారులు వివరించారు.
పాకిస్తాన్, POKలో మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని అధికారులు తెలిపారు.