కైకాల తుదిశ్వాస విడిచారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను – పవన్ కళ్యాణ్

-

దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కైకాల మరణం వార్త తెలిసి పలువురి సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆయన తుది శ్వాస విడిచారని తెలిసి భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. “శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఆత్మకు శాంతి చేకూరాలి. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రముఖ నటులు శ్రీ కైకాల సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబానికి శ్రీ సత్యనారాయణ గారు సన్నిహితులు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి అన్నయ్య చిరంజీవి గారితోను, మాతోనూ ఆప్యాయంగా ఉండేవారు. ఇటీవల ఆయనతో మాట్లాడాను. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకున్నాను.

శ్రీ సత్యనారాయణ గారిని అభిమానులు నవరస నటనా సార్వభౌమ అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతినాయక పాత్రలను ఎంత అవలీలగా పోషించారో అదే స్థాయిలో కరుణరస ప్రధానమైన పాత్రల్లోనూ ఒదిగిపోయారు. పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు. తెలుగువారికి యమధర్మరాజు అంటే శ్రీ సత్యనారాయణ గారే. ఆ పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా చేశారు. ఏ తరహా పాత్రనైనా ప్రేక్షకుల మెప్పు పొందేలా నటించారు.

నిర్మాతగాను మంచి చిత్రాలు అందించారు. లోక్ సభ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారు. తెలుగుదనం మూర్తీభవించిన శ్రీ సత్యనారాయణ గారు లేని లోటు తెలుగు చిత్రసీమలో తీర్చలేనిది. శ్రీ కైకాల సత్యనారాయణ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని సోషల్ మీడియా వేదికగా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version