ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు : పవన్‌

-

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు నాల్గవ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన, టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో కదంతొక్కాయి. పవన్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు… అలాగే నారా లోకేశ్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబుతో రాజధాని, ప్రత్యేక హోదా అంశాలపై విభేదించానని, ఈసారి అలాంటి విభేదాలు రావని బలంగా నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

ప్రత్యేకహోదాపై ప్రధానితో విభేదించాను.. ప్రత్యేక ప్యాకేజీ ఎలా తీసుకుంటారని చంద్రబాబుతో విభేదించాను అని వివరించారు. 2024లో ఓటు చీలకూడదని, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా… అండగా నిలవండి అని కోరారు. ఏపీని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ కూటమి విజయమే వ్యాక్సిన్ అని పవన్ స్పష్టం చేశారు. జనసేన గ్లాసు గొంతుకు దాహం తీర్చుతుందని, టీడీపీ సైకిల్ నేలను అంటిపెట్టుకుని ఉంటుందని, ఈ రెండూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని స్థాపించి… కరెంటు కోత మోగించే వైసీపీ ఫ్యాన్ ను పీకేద్దాం అని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version