తలరాతను మార్చే పోస్ట్ కోసం కాంగ్రెస్ లో భలే డిమాండ్.. హస్తినలో పైరవీలు షురూ..

-

తెలంగాణలో పీసీసీ ఛీప్ పదవి కన్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కు క్రేజ్ ఎక్కువ.. ఆ పోస్ట్ తీసుకున్న వారందరూ.. పార్టీలో ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయారు.. కొందరు డిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకుంటే.. మరికొందరు.. రాజకీయ భవిష్యత్తుకు ఢోకాలేకుండా చేసుకున్నారు..దీంతో ఆ పోస్టును దక్కించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు.. తమ సమర్దతను చూసి… పోస్ట్ ఇప్పించాలంటూ హస్తిన చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.. పార్టీ కోసం చేసిన కార్యక్రమాల లిస్ట్ ను వారి ముందు పెడుతున్నారు..దీంతో ఆ పోస్టు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది..

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన వారందరికీ భవిష్యత్ లో మంచి రాజకీయ అవకాశాలే వచ్చాయి.. రాష్ట విభజన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ను ఏఐసీసీ క్రియేట్ చేసింది..
తెలంగాణ ఏర్పడిన‌ సమయంలో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ ఛీప్ ఛాన్స్ దక్కింది.. అప్పుడు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ‌కాశం ల‌భించింది. అనంతరం జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో పార్టీ ఓటమి చవిచూడటంతో.. పొన్నాలను తప్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ఉన్న ఉత్తమ్‌కు పీసీసీ చీఫ్‌గా ఛాన్స్ ఇచ్చింది. ఆ పదవిలో ఆయన ఏడేళ్ల పాటు కొనసాగారు.. పార్టీలో మంచిపట్టు సంపాదించుకోవడంతో పాటు.. అగ్రనేతల మెప్పు పొందారు కూడా..

ఉత్తమ్‌ తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కకు ద‌క్కింది. ఆ త‌ర్వాత భ‌ట్టి సీఎల్పీ ప్రచార క‌మిటీ చైర్మన్‌గా, సీఎల్పీ లీడ‌ర్‌గా ఎంపికయ్యారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసిన భ‌ట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్‌2గా వ్యవహరిస్తున్నారు. భట్టి తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వగా, పొన్నం ప్రభాక‌ర్‌కు మంత్రి యోగం పట్టింది. ఆఖ‌రికి మొన్నటికి మొన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేష‌న్ ఇంచార్జ్‌గా ఉన్న మ‌హేష్‌కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది.

ఇప్పుడు ఆయ‌న పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గోల్డెన్ పోస్ట్ గా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.. ఈ పోస్ట్ కోసం ఢిల్లీ లెవల్లో పైర‌వీలు జరుగుతున్నాయనే టాక్ పార్టీలో వినిపిస్తోంది.. కాంపిటేషన్ ను గుర్తించిన ఏఐసీసీ పెద్దలు ఈసారి.. ఎక్కువ మందిని వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా నియమించాలని ఆలోచిస్తోందట.. సామాజికవర్గాల వారీగా నియమిస్తే.. పార్టీ బలోపేతం అయ్యే చాన్స్ ఉందనే అభిప్రాయంలో వారు ఉన్నారట..దీంతో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు పైరవీలు చేస్తున్నారు.. ఎవరికి ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కుతుందో మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version