అక్కడ ప్రసాదం జేసీబీ, కాంక్రీట్‌ మిక్సర్ల సాయంతో చేస్తారు..!!

-

ఆలయాల్లో ప్రసాదం చేయడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఎంత కష్టమైనా మనుషులే స్వయంగా చేత్తో చేస్తారు. మిషన్లు వాడతారు కానీ.. కొంతమేరే.. కానీ ఆ ఆలయంలో జేసీబీతో ప్రసాదం తయారు చేస్తున్నారు. కాంక్రీట్‌ మిక్సర్లతో మిక్స్‌ చేస్తున్నారు. అది చూస్తే..ఏదో భవన నిర్మాణం జరుగుతున్నట్లు ఉంటుంది కానీ.. ప్రసాదం చేస్తున్నట్లు ఎవరూ అనుకోరు. ఎందుకలా చేస్తున్నారు.?
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో దంద్రౌవా ధామ్ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. అది హనుమంతుడి ఆలయం. ఇక్కడ ఏటా సియా పియా మిలన్ పేరుతో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ప్రముఖ ప్రవచనకర్త ధీరేంద్ర కుమార్ శాస్త్రి పురాణ కథలు, ప్రవచనాలు చెబుతుంటారు. ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రవచనాలు వినేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీ ఎత్తున వస్తారు. వందలు, వేలు కాదు.. దేశం నలుమూలల నుంచి లక్షల్లో వస్తుంటారు. ఆలయం చుట్టుపక్కల తాత్కాలిక వసతులను ఏర్పాటు చేసుకొని.. రెండు మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. వారికి ఆలయ నిర్వాహకులే భోజనం, ప్రసాదాలు ఇస్తారు. లక్షల మందికి భోజన ప్రసాదాలు చేయాలంటే చిన్న విషయం కాదు. అందుకోసం పెద్ద పెద్ద యంత్రాలను వినియోగిస్తారు.
ఓ గ్రౌండ్‌లో కిచెన్ సెటప్‌ ఏర్పాటు చేసి.. అక్కడే వివిధ రకాలను వంటలను వండుతారు. ప్రతి రోజూ 30 ట్రాలీల భోజనంతో పాటు ప్రసాదం కోసం 40 ట్రాలీలు మల్ పువా, 20 ట్రాలీల ఖీర్ సిద్ధం చేస్తారు. ఇందుకోసం రోజూ 300 క్వింటాళ్ల బంగాళదుంపలు, 1.5 టన్నుల పాలు, ఒక టన్ను బియ్యం, 75 క్వింటాళ్ల చక్కెర, 15 టన్నుల మైదాను వినియోగిస్తున్నారు. పిండి కలిపేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాలను, వంటకాలను పాత్రల్లో వేసేందుకు జేసీబీలను, వాటిని తరలించేందుకు ట్రాలీలను ఉపయోగిస్తారు. ఇక్కడ ఉపయోగించే ఒక పాత్ర.. రాష్ట్రంలోనే అతి పెద్దది.
నవంబరు 15 నుంచి ప్రారంభమైన ఈ ప్రవచానాలు వినేందుకు ఇప్పటికే.. దాదాపు 4 లక్షల మంది వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version