నొక్కితే మానవ శరీరంలా లోపలికి వెళ్లే నరసింహస్వామి దేవాలయం ఎక్కడుందో తెలుసా ?

-

నారసింహస్వామి అంటే తెలుగు వారికి అత్యంత భక్తి. దేశంలో ఎక్కడ లేని అన్ని నారసింహ క్షేత్రాలు తెలుగురాష్ట్రాలలో ఉన్నాయి. అందులో ఒక్కోక్కటి ఒక్కో ప్రత్యేకం కలిగి ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు 250 కి.మీ దూరంలో ఉన్న నారసింహస్వామి మానవ శరీరంలాంటి విగ్రహ రూపంలో వెలసి ఉన్నారు. స్వామి శరీరం పై వేలు పెట్టినొక్కితే లోపలకి పోతుంది. వేలు తీయగానే మామూలు శరీరం లాగా అయిపోతుంది. అలాంటి విశేషమైన నారసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం….

వరంగల్ కి 130 కి.మీ. ల దూరంలో అటవీ ప్రాంతంలో వున్నదీ ఆలయం. చిన్న కొండమీద ఆలయం .. చిన్నదైనా మహిమాన్వితమైన క్షేత్రమిది. ఇక్కడ వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ. 6 అడుగుల ఎత్తుగా, శంఖు, చక్ర, గదాయుధాలతో నిలుచునట్లు ఉంటారు స్వామి. వక్షస్ధలం నుంచి నాభి వరకు వేలితో నొక్కితే వేలు లోపలకెళ్తుంది. వేలు తీసేస్తే ఆ ప్రాంతం మళ్లీ మామూలుగా అవుతుంది. పూజారిగారు ఈ విశేషాన్ని చూపిస్తారు.

భక్తులను తాకనివ్వరు. స్వామి నాభి నుంచి ద్రవం స్రవిస్తూవుంటుంది. దీనికి ఒక కధ చెప్తారు. హిరణ్యకశిపుడి సంహారం కోసం స్వామి ఈ అరణ్యంలోకి వచ్చినట్లు, చెంచు లక్ష్మీని ఇక్కడే వివాహమాడినట్లు కాలక్రమేణా గుహాంతర్భాగాల్లో మరుగునపడ్డట్లు చెప్తారు. తర్వాత కాలంలో భారద్వాజ, అంగీరస మహర్షులు సంచారం చేస్తూ ఈ ప్రాంతంలో ఒక రాత్రి విశ్రమించారు. అప్పుడు స్వామి వారికి స్వప్న దర్శనమిచ్చి తనని వెలికి తీయమని ఆదేశించాడు. వారు పలుగుతో స్వామి చెప్పినచోట తవ్వగా స్వామి నాభి దగ్గర పలుగు తగిలి రక్తం కారిందిట. ఋషులు వెంటనే చందనం అరగదీసి స్వామికి పరిచర్యలు చేశారుట. ఆ దెబ్బ తగిలిన ప్రదేశంలోనే ఇప్పడూ చీములాంటి ద్రవం స్రవిస్తూవుంటుంది. దానిని గంధంతో కలిపి సంతానం లేనివారు సేవిస్తే సంతానం కలుగుతుందంటారు.

శని, ఆది, సోమవారాలలో స్వామికి అభిషేకం జరిగిన తర్వాత మాత్రమే ఈ ద్రవాన్ని కోరినవారికి ఇస్తారు. చిన్న గుట్టమీద వున్న ఈ ఆలయం చేరుకోవటానికి 130 మెట్లు ఎక్కాలి. మొదట్లో స్వయంభూ ఆంజనేయస్వామిని దర్శించుకోవచ్చు. పైన స్వామి ఆలయానికి ఇరుపక్కలా అమ్మవార్లు ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మిల ఉపాలయాలను తర్వాత నిర్మించారు. అసలు ఆలయం 2వ శతాబ్దంనాటిదంటారు. ఈ ప్రాంతంలో కోతులు ఎక్కువగా ఉంటాయి.

చింతామణి జలపాతం

ఆలయం సమీపంలోనే వున్న ఈ జలపాతంలోని నీరు అద్భుత ఔషధ గుణాలుగలదనీ, దీనిని సేవిస్తే అనేక రుగ్మతలు తొలగిపోతోయనీ విశ్వసిస్తారు. కారణం ఈ నీరు అనేక ఔషధ మొక్కలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. జలపాతం అన్నానని ఎత్తుమీద నుంచి దూకే ప్రవాహాన్ని ఊహించుకోకండి. అత సన్నటి ధార మాత్రమే. దీనిని అనేకమంది సీసాలలో తీసుకెళ్లి (కావాల్సినవాళ్ళు సీసాలు తమతో తీసుకెళ్ళాలి..అక్కడ దొరకవు) రోజూ ఔషధంలాగా సేవిస్తారు.

దర్శన సమయాలు

ఉదయం 10 గం. లనుంచీ సాయంత్రం 4 గం.లదాకా. మధ్యలో 1 గంట భోజన విరామం. అడవి ప్రాంతం కనుక వసతి, భోజనం వగైరా సౌకర్యాలు ఏమీ వుండవు.

ఇతర దర్శనీయ ప్రదేశాలు

వరంగల్ నుంచి మల్లూరు వెళ్ళే రహదారిలో సమ్మక, సారలక్కల గద్దెలున్న మేడారం (రహదారికి సుమారు 14 కి.మీ.ల దూరంలో) జాతర లేనప్పుడుకూడా చూడవచ్చు, పాలంపేటలో ప్రసిధ్ధికెక్కిన శిల్పకళానిలయం రామప్ప దేవాలయం (రహదారినుంచి 16 కి.మీ.ల దూరంలో), రామప్ప గుడినుంచి 10 కి.మీ.ల దూరంలో అతి పురాతన కోటగుళ్ళు వున్నఘనాపూర్ సందర్శనీయ స్ధలాలు. అయితే అరణ్య ప్రాంతం కనుక ముందు మల్లూరు వెళ్ళి, వస్తూ వీలునిబట్టి మిగతా ప్రదేశాలు సందర్శించవచ్చు.

ప్రయాణ సౌకర్యాలు

హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్ళే మార్గంలో వున్న మల్లూరు దాకా (మంగపేట వెళ్ళే బస్సు) బస్సు సౌకర్యం వున్నది. అక్కడ నుంచి ఆలయానికి 4 కి.మీ.లు లోపలకెళ్ళాలి. మార్గం, ఆలయ పరిసరాలు పచ్చని చెట్లతో అందంగా వుంటాయి. ఆటో సౌకర్యం వుంటుందిగానీ రేట్లు కొంచెం ఎక్కువన్నారు. ఇలాంటి ప్రదేశాలకు సిటీనుంచి వెళ్ళేవాళ్ళకి సొంతవాహనమయితే సౌకర్యంగావుంటుంది.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news