ఈ దుర్మార్గానికి పాల్పడినవారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు : తానేటి వనిత

-

కృష్ణా జిల్లా పామర్రు మండలం నిబానుపూడిలో ఇటీవల మైనర్‌ బాలికపై మృగాళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే.. అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక మృతి చెందింది. ఈ క్రమంలో.. బాధిత మైనర్‌ బాలిక కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి మనో ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారం గురై మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికీ రాకూడదన్నారు.

దుర్మార్గంగా అత్యాచారం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్.. తక్షణమే స్పందించారన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు జరిగితే.. జగన్ సర్కార్ వెంటనే స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఇలాంటి బాధాకర విషయాలపై కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏ కుటుంబంలో ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగకూడదని అన్నారు. నిందితులకు యావజ్జివ కారాగార శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే.. బాధిత కుటుంబానికి స్థానిక వైసీపీ నాయకత్వం అన్నివేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ కుమార్ భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version