కాంగ్రెస్ సర్కారు నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఉద్యమకారులను, కార్యకర్తలను కలిసేందుకు ఆమె భద్రాచలం చేరుకున్నారు. ముందుగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఆమె.. అమ్మవారికి సారె సమర్పించారు.
ఆ తర్వాత హరిత హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.ఉద్యమ కారులది, బీఆర్ఎస్ పార్టీది రక్త సంబంధం అన్నారు. ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ ఆవిర్భవించేదే కాదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించకపోయినా కేసీఆర్ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తుచేశారు.70 లక్షల సభ్యత్వాలు ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. ప్రతి కార్యకర్తా తలెత్తుకుని జీవించేలా పార్టీ చేస్తుందని కార్యకర్తలకు కవిత హామీ ఇచ్చారు. కేసీఆర్ను సీఎం చేసేలా అందరూ కష్టపడాలని పిలుపునిచ్చారు.