తెలంగాణలోని వాసులకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలోని రేషన్ కార్డు లేని ప్రజలకు కొత్తగా రేషన్ కార్డులను ఏర్పాటు చేయనుంది. రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లకు దాటినట్లుగా సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు. రెండు లక్షలకు పైగా కొత్త కార్డులు, 29 లక్షలకు పైగా కొత్త సభ్యులు రేషన్ కార్డులో చేరినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం 79.49% కుటుంబాలకు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నాయని సివిల్ సప్లై అధికారులు వెల్లడించారు.

కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ఉన్నట్లుగా వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా సమాచారం అందుతోంది. రేషన్ కార్డుల మంజూరు ఒక నిరంతర ప్రక్రియ అని, ఇంకా పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. దరఖాస్తులు ఇంకా చాలా ఉన్నాయని పౌరసరాఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో 60 ఏళ్లు దాటిన స్త్రీలు, దివ్యాంగులకు మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 60 ఏళ్లు దాటిన స్త్రీలు, దివ్యాంగులకు మహిళా సంఘాల ద్వారా డబ్బులు అందే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు.