ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో జరుగుతున్న స్థలాల కొనుగోళ్ల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. అనధికారిక లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురికావద్దని ప్రజలకు సూచించారు. నగరంలోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆ విషయం పై ఫిర్యాదు అందింది. రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలోని 50వ సర్వే నెంబర్ లోని ఎకరం రెండు గుంటల భూమిని ఫామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్లుగా అమ్ముతున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు.
ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం.. అనుమతి తీసుకొని లే అవుట్ ను అభివృద్ధి చేస్తే.. సర్కార్ కి ఫీజు చెల్లించాలి. అది తప్పించుకునేందుకు కొందరూ వ్యాపారులు వ్యవసాయ శాఖ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. అలా అమ్మాలంటే గజాల్లో కాకుండా కనీసం అర్థ ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.