ఆడపిల్ల పుట్టిందని పసికందు గొంతు కోసి హత్య చేసాడు ఓ తండ్రి. ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాల్ నుండి వచ్చి ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు మృతి చెందాడు.

14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి పెట్టాడు తండ్రి. ఒక గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడని నిలదీయగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని చెప్పాడు జగత్.
దీంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తులకు సమాచారం ఇచ్చేందుకు బయటకు వెళ్లిన సమయంలో, మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసాడు తండ్రి. ఇక గౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, జగత్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.