ఎల్బీనగర్‌లో అగ్ని ప్రమాదం.. 50 కార్లు దగ్ధం!

-

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం రోజున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఎల్బీనగర్‌ చౌరస్తాకు సమీపాన ఉన్న గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది. ఓ గ్యాస్‌ సిలిండర్‌ భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో సుమారు 50 కార్లు కాలిపోయినట్లు అంచనా. మంటలు రెండు గంటలపాటు అదుపులోకి రాలేదు.

ఓ సమయంలో పక్కనున్న అపార్ట్‌మెంట్లకు వ్యాపించేలా మంటలు అటువైపు సాగాయి. దాంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పలువురు బయటికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో రాత్రి 10.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. గ్యారేజీ వెనుకనున్న గృహోపకరణాల షోరూంకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

నాలుగు కార్లను సురక్షితంగా బయటకు తీశామని, మిగిలినవి కాలిపోయాయని ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా గ్యారేజీ యజమాని విజయ్‌కుమార్‌ రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లిందంటూ లబోదిబోమన్నారు. కాలిపోయిన కార్లను చూసి సొమ్మసిల్లి పడిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version