ఏపీలో BRS ఆవిర్భావ సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్

-

ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పార్టీ నేత చింతల పార్థసారథిలు బుధవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ విస్తరణ, పటిష్ఠ నిర్మాణంపై చర్చించారు. త్వరలో సభా వేదిక, నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.

దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి ప్రబలంగా తీసుకెళ్లాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా చంద్రశేఖర్‌కు సూచించారు. ఏపీ రాష్ట్ర కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పారు. భారీఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని, నిర్మాణాత్మక వైఖరితో ముందుకొచ్చే వారిని పార్టీలో చేర్చుకోవాలన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పన చేయాలని కేసీఆర్‌ చెప్పారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ నిర్దేశాల మేరకు ఏపీ భారాస ముందుకు సాగుతుందన్నారు. పార్టీపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందని, పెద్దఎత్తున చేరికలుంటాయని, ఇప్పటికే పలువురు సంప్రదిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version