202 రోజులు నిరంతరాయ విద్యుదుత్పత్తి.. కేటీపీపీ సరికొత్త రికార్డు

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (కేటీపీపీ) సరికొత్త రికార్డు సృష్టించింది. 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో మొదటి యూనిట్ 500, రెండో యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల యూనిట్‌ 194 రోజులు నిరంతరాయంగా నడిచింది. ఆ రికార్డును తాజాగా కేటీపీపీ తిరగరాసింది.

భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్తు కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబరు 15వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచినట్లు అధికారులు తెలిపారు. 202 రోజుల్లో 85.36 శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించినట్లు వెల్లడించారు. ప్రభుత్వరంగ విద్యుత్తు కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజులు ఏకబిగిన నడిచిన యూనిట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. 202 రోజుల్లో ఈ యూనిట్‌లో 2,460.2 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version