అధికారంలో మార్పెందుకు.. కరెంటు కోతలు, స్కాముల కోసమా? : కేటీఆర్

-

తెలంగాణలో ప్రజలు రిస్క్ తీసుకోవడానికి ఆసక్తిగా లేరని.. తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని చూసి మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలని భావిస్తున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. అసలు రాష్ట్రంలో మార్పు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. కరెంటు కోతలు, స్కాముల కోసమా? లేక ఎండే చెరువులు, నెర్రెలు బారే నేలల కోసమా అని అడిగారు. గుజరాత్‌లో అయిదుసార్లు బీజేపీ.. దేశంలో 11సార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండొచ్చా? అని అన్న కేటీఆర్.. తెలంగాణలో మాత్రం రెండుసార్లకే మార్పు కావాలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పత్రికా సంపాదకులతో నిర్వహించిన భేటీలో కేటీఆర్ పాల్గొన్నారు.

తప్పు చేయడం మానవ సహజమన్న మంత్రి… మెరుగ్గా ఉద్యోగ నియామకాలు చేసినా మరింత సమర్థంగా వ్యవరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం, సమర్థ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఉద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో తమకు 70 నుంచి 82 సీట్లు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆల్ రౌండ్ అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలను ఎన్నో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అభివృద్ధికి ఓటు వేయాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version