కేటీఆర్‌‌కు మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరిక..!

-

ప్రభుత్వ దవాఖాన్లను నాశనం చేసే కుట్రలను మానుకో అని కేటీఆర్‌‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరం. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ దవాఖాన్లను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చిపోలేదు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పది సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్‌‌ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటు.

గాంధీ వంటి టెర్షియరీ కేర్ హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారు. చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేర ప్రయత్నిస్తారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారు. అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే మరణాలు జరిగాయంటూ నంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నారు. ఆయన అజ్ఞానికి, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే ఆయన సహజ గుణానికి ఆయన మాటలు అద్దం పడుతున్నాయి. గాంధీని నాశనం చేసి, పేషెంట్లను రానీయకుండా చేసి కార్పొరేట్ హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చాలని ఆయన కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రలో భాగంగానే గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లుతున్నారు. ఇకనైనా ఇలా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేయడం మానుకోకపోతే, ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారు అని దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version