కేసీఆర్ సర్కార్ సాగునీటిపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిందని.. అయినా అదనంగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వలేకపోయిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిజాంసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని అన్నారు. లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని మండిపడ్డారు. నిజామాబాద్లో ‘రైతు మహోత్సవం’ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యామ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్టి తెలిపారు. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని వివరించారు. పెండింగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.