కుర్చీలో కేసీఆర్‌ ఫొటో పెట్టి.. కాంగ్రెస్‌ నేతల వినూత్న నిరసన

-

మరికొద్ది క్షణాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో ఇవాళ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చిత్రపటాన్ని కుర్చీలో పెట్టి ఆందోళనకు దిగారు.

2014, 2019 ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత ‘నల్గొండ జిల్లాలోని తాగు, సాగునీటి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని మరీ పూర్తి చేస్తామన్నారంటూ సంబంధిత వీడియోను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఏపీ అసెంబ్లీలో కేసీఆర్‌ను సీఎం జగన్‌ పొగిడిన వీడియోను కూడా చూపించారు. అనంతరం జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అన్నారు. 90 శాతం పూర్తయిన వాటిని కూడా పట్టించుకోకపోవడంతో సాగు, తాగునీటి ఎద్దడి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఆయన అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version