ప్రజాభవన్ వద్ద రద్దీ.. ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

-

ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన ప్రజా వాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి తెల్లవారు జామునే ప్రజాభవన్కు జనం పోటెత్తుతున్నారు. తమ సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు హాజరై స్వయంగా ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్నారు. రెండు పడక గదుల కోసం ఒకరు, భూ సమస్యపై మరొకరు, ఫింఛన్లు రావడం లేదని కొంతమంది ప్రభుత్వాన్ని వేడుకుంటూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు స్వయంగా దరఖాస్తులను స్వీకరించి బాధిత ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ప్రజా భవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మరోవైపు ప్రజాభవన్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు నిరసనకు దిగారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల 10లోపు జీతాలు, మెస్‌ బిల్లులు చెల్లించాలని, పెంచిన రూ.3 వేల జీతాన్ని వెంటనే ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version