ఈనెల 29, 30న తెలంగాణలో పాఠశాలలకు సెలవులు

-

తెలంగాణలో ఈ నెల 30వ తేదీన శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు సిబ్బంది ముందురోజు మధ్యాహ్నం నుంచే చేరుకుంటారని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు. అందువల్ల ఈ నెల 29, 30 తేదీల్లో బడులకు సెలవులని విద్యాశాఖ వర్గాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు అధికారికంగా ప్రకటించనున్నారట.

పోలింగ్‌ పూర్తై ఈవీఎంలను తీసుకొని ఆయా కేంద్రాలకు వెళ్లి సమర్పించి వచ్చే సరికి అర్ధరాత్రి దాటుతుందని.. అందువల్ల విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1వ తేదీ కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news