సింగరేణి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

-

తెలంగాణలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. రెండేళ్ల నుంచి వాయిదాపడుతూ వస్తున్న ఎన్నికలు ఎట్టకేలకు హైకోర్టు జోక్యంతో ఇవాళ జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఈ ప్రక్రియ సాయంత్రం ఐదింటి వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 39 వేల 773 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి ఎన్నికల అధికారిగా శ్రీనివాసులు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. అందుకుగానూ 84 పోలింగ్‌ కేంద్రాలు, 11 కౌంటింగ్‌ కేంద్రాలు, 168 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచినప్పటికీ.. ప్రధానంగా సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల మధ్యే పోటీ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఏడింటికి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అర్ధరాత్రికి ఫలితాలు వచ్చే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version