సాధారణంగా మన ఇళ్లలో లేదా సినిమాల్లో మహిళలు చిన్న విషయానికే ఎమోషనల్ అయి ఏడ్చేస్తుండడం చూస్తూనే ఉంటాం. అదే మగవారు అంతగా ఏడవరని, గుండె గట్టిదనే టాక్ కూడా ఉంది. అయితే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు.. దీని వెనుక పెద్ద సైన్స్ దాగుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఏడవడానికి గల అసలు కారణాలను రీసెర్చ్ ద్వారా నిరూపించారు.
ఏటా ఎవరు ఎన్నిసార్లు ఏడుస్తారు?: పరిశోధనల ప్రకారం.. మహిళలు ఏడాదికి సగటున 30 నుండి 64 సార్లు ఏడుస్తుండగా, పురుషులు మాత్రం కేవలం 6 నుండి 17 సార్లు మాత్రమే ఏడుస్తారట. అంటే మగవారితో పోలిస్తే ఆడవారు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకుంటారు.
హార్మోన్ల ఆట.. కన్నీటి గ్రంథుల సైజు: మహిళల్లో ఏడుపును ప్రేరేపించే ‘ప్రోలాక్టిన్’ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దీనికి తోడు వారి కళ్లలో ఉండే కన్నీటి గ్రంథులు పురుషుల కంటే చిన్నవిగా ఉంటాయట. అందువల్ల గ్రంథులు త్వరగా నిండిపోయి కన్నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ శారీరక నిర్మాణమే వారిని అంత త్వరగా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.

మగవారి కన్నీళ్లను ఆపే టెస్టోస్టెరాన్: మరోవైపు పురుషులలో ఉండే ‘టెస్టోస్టెరాన్’ అనే హార్మోన్ వారి కన్నీళ్లను అణిచివేయడానికి సహాయపడుతుంది. ఇది మగవారిని అంత సులభంగా ఏడవనివ్వదు. ఇక కేవలం హార్మోన్లే కాకుండా, “మగవారు ఏడవకూడదు.. ధైర్యంగా ఉండాలి” అని చిన్నప్పటి నుంచి సమాజం చెప్పే మాటలు కూడా వారి భావోద్వేగాలను లోపలే దాచుకునేలా చేస్తాయి.
కాబట్టి మహిళలు ఎక్కువగా ఏడుస్తారంటే దానికి కారణం వారి బలహీనత కాదు, వారి శరీరంలో జరిగే సహజమైన హార్మోన్ల మార్పులే. ఏడుపు అనేది ఒక నార్మల్ హ్యూమన్ ఫీలింగ్.. కాబట్టి ఆడవారైనా, మగవారైనా బాధ కలిగినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం పూర్తిగా ఆరోగ్యకరం.
గమనిక: ఏడవడం వల్ల మనసులోని ఒత్తిడి తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుందని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఎమోషన్స్ ను లోపల దాచుకోవడం కంటే బయటకు వెళ్లగక్కడం మంచిది.
