రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం

-

జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్లు ఈ టోర్నీ ఆడతారు.జూలై 3 నుండి జూలై 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో ఇంగ్లండ్, ఇండియా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్,దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

అందరూ ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జూలై 6న జరగనుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీ చేస్తుండగా.. పాకిస్థాన్ జట్టును షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయనున్నాడు. మ్యాచ్ లు ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరుగుతుంది.

సురేశ్ రైనా,యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, డేల్ స్టెయిన్,కెవిన్ పీటర్సన్, షాన్ మార్ష్, ఇమ్రాన్ తాహిర్,బెన్ కట్టింగ్, షాహిద్ అఫ్రిది, ఆరోన్ ఫించ్, బ్రెట్ లీ వంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ లీగ్ లో మొత్తం 10 రోజుల పాటు 18 మ్యాచ్‌లు జరుగుతాయి. రౌండ్ రాబిన్ తరహాలో ప్రతి జట్టు మిగిలిన ఐదు జట్లతో ఒకసారి తలపడుతుంది. ఈ మ్యాచ్ లకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్, నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్ ఆతిధ్యమిస్తాయి. లీగ్ దశల్లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు జూలై 12 న సెమీ ఫైనల్‌కు ఆడతాయి. జూలై 13 ఫైనల్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version