సంక్రాంతి పందెం కోళ్లు ఇవే.. విజేత ఎవరో?

-

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమా అగ్ర కథానాయకులు. వందకు పైగా చిత్రాల్లో నటించి.. అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. అటు మాస్​ ఇటు క్లాస్​తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినిమాకు బ్లాక్​బస్టర్లు అందించి.. ఎందరో నటీనటులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆపదలో ఆదుకోవడంలోనూ ముందున్నారు ఈ సూపర్ స్టార్లు. ఇక వీరిద్దరికీ ఉండే అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నవతరం కథానాయకులు వస్తున్నా వారికి పోటీగా నిలుస్తూ ఇంకా టాలీవుడ్​ను ఏలుతున్నారు. వీరిద్దరి సినిమా రిలీజ్​ అవుతుంటే.. అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే వీరిద్దరూ చాలా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’, బాలయ్య నటించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలు కూడా ఒక రోజు వ్యవధిలో రిలీజ్ అయి పోటీ పడ్డాయి. అయితే ఈ ఇద్దరు స్టార్స్​ మరోసారి పోటీ పడటానికి రెడీ అవుతున్నారు.

వాల్తేరు వీరయ్య: బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్​​ను సోమవారం విడుదల చేశారు. దీంతో పాటు టైటిల్​ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో మెగాస్టార్​ లుంగీ కట్టుకుని ఊరమాస్​ లుక్​లో అదరగొట్టారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ‘అందరివాడు’లో మాస్​ లుక్​లో అదుర్స్​ అనిపించిన చిరు.. తాజా లుక్కులో అంతకు మించి ఎంటర్​టైన్​మెంట్​ అందించనున్నారని స్పష్టం అవుతోంది.

మాస్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రముఖ తెలుగు నటుడు రవితేజ ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్​స్టార్​ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నఈ ప్రాజెక్ట్​ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. మాస్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈసినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే మూవీటీమ్​ తెలిపింది.

అయితే అదే సంక్రాంతికి వచ్చేందుకు నటసింహం బాలకృష్ణ కూడా సిద్ధమయ్యారు. ‘అఖండ’ విజయంతో సెన్షేషన్​ క్రియేట్​ చేసిన ఆయన.. అదే జోరులో గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇది దసరాకు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడది రూటు మార్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ మేరకు దీపావళి కానుకగా.. చిత్ర యూనిట్​ ఈ సినిమా టైటిల్​ను అక్టోబర్​ 21న విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్​ ఆనందంలో మునిగిపోతున్నారు.

అయితే పోస్టర్​లో బాలయ్య.. మాస్​ లుక్​లో ఉన్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా, ‘వీరసింహా రెడ్డి’లో కన్నడ స్టార్​ దునియా విజయ్​కుమార్​ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్​కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలకృష్ణ అటు వెండి తెరపై.. ఇటు బుల్లి తెరపై తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు పర్సనల్​, పొలిటికల్​గా కూడా బిజీగా ఉన్నారు బాలయ్య.

అగ్ర కథానాయకుల సినిమాలతో సంక్రాంతికి ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్కు ఉండబోతోంది. దాంతో పాటు సందడి వాతావరణం క్రియేట్ అవ్వడం, టాలీవుడ్ మరింత కళకళలాడుతుందని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం ఒక ఎత్తైతే.. వీటిని మైత్రి మూవీ మేకర్స్​ నిర్మించడం మరో విశేషం. మరింత విడ్డూరమేంటంటే రెండింటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్​గా నటించింది. మరి ఈ సినిమాలు ఏ మేరకు విజయం సాదిస్తాయో వేచి చూడాలి.

 

ఆదిపురుష్: పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కతున్న చిత్రం ‘అదిపురుష్’. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఓం రౌత్​ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే దీనికి మిశ్రమ స్పందన లభించింది. అయినా చిత్ర యూనిట్​ థియేటర్లలో త్రీడీ టీజర్ వేసి మరీ.. తమకు సినిమాపై ఉన్న నమ్మకాన్ని చాటుకున్నారు. తెలుగులో ఈ మూవీ సంక్రాంతి పోరును తట్టుకుని ఎలా నిలబడగలుగుతుందో వేచి చూడాలి.

ఏజెంట్: అక్కినేని అఖిల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాజెక్ట్​ ‘ఏజెంట్’. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. ‘మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మంచి విజయం అందుకున్న అఖిల్.. ‘ఏజెంట్​’తో బ్లాక్​బస్టర్​ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. స్పై కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో రొమాన్స్​తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్​లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొదట ఆగస్టులో, ఆ తర్వాత డిసెంబర్​లో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ సంక్రాంతికి రిలీజ్ డేట్​ ఫిక్స్​ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సురేంధర్​ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య లీడ్​ రోల్​లో​ నటిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో విడుదల అవుతోంది.

వారసుడు: తమిళ నటుడు విజయ్​ కథానాయకుడిగా టాలీవుడ్​ స్టార్ ప్రొడ్యూసర్ దిల్​ రాజు నిర్మాణంలో వస్తున్నసినిమా ‘వారసుడు’. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ కాజ్​, జయసుధ, శ్రీకాంత్, సంగీత, శరత్ కుమార్, తమిళ నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news