గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అరగంట సమయంలోనే రెండుసార్లు బెదిరింపు కాల్స్ చేసి చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ బెదిరింపు కాల్స్పై రాజాసింగ్ స్పందించారు. ఆదివారం మద్యాహ్నం రెండు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం అని వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మిమ్మల్ని మీ యోగి, మీ మోడీ కూడా రక్షించలేరు అని దుండగులు బెదిరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మొదటి కాల్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండోసారి మధ్యాహ్నం 3.54 గంటలకు వచ్చిందని.. ఏదో ఒకరోజు తనను చంపేస్తామని ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈ ఘటనపై రాజాసింగ్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు కేసు నమోదు చేసుకొని, ఫోన్ కాల్స్ పై విచారణ చేస్తున్నారు. అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇది వరకు కూడా పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి.