మనం హాయిగా టాయిలెట్ సీటుపై కూర్చుని ఫోన్ చూస్తుంటే సమయమే తెలియదు. పది నిమిషాలు కాస్తా అరగంట అయిపోతుంది. కానీ, అక్కడే ఉంది అసలు ప్రమాదం! దీనినే వైద్యులు ‘స్ట్రైనింగ్ ప్యారడాక్స్’ అంటున్నారు. అంటే, మీకు తెలియకుండానే మీరు మీ శరీరంపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతున్నారని అర్థం. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ అలవాటు గురించి నిపుణులు చేస్తున్న హెచ్చరికను చదివి తెలుసుకోండి.
మనం టాయిలెట్కు వెళ్లేది విసర్జన కోసం, కానీ ఫోన్ చేతిలో ఉంటే అది ఎంటర్టైన్మెంట్ జోన్లా మారిపోతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మీ మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. మన శరీరం ఇంత సేపు ఆ భంగిమలో ఉండటానికి డిజైన్ చేయబడలేదు.
సాధారణ కుర్చీలో కూర్చున్నప్పుడు మన శరీరానికి లభించే సపోర్ట్ టాయిలెట్ సీటుపై ఉండదు. అక్కడ మధ్యలో ఖాళీ ఉండటం వల్ల మలద్వారం వద్ద రక్తం ఎక్కువగా పేరుకుపోతుంది. ఇక మీరు ఎంత ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే, అక్కడ రక్తనాళాలు అంతగా ఉబ్బుతాయి. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీస్తుంది.

చాలా మంది గంటల తరబడి ఫోన్ చూస్తూ కూర్చోవడం వల్ల ‘హేమరాయిడ్స్’ లేదా పైల్స్ బారిన పడుతున్నారు. ఇవి మలద్వారం లోపల ఉండే రక్తనాళాలు వాచిపోవడం వల్ల వస్తాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి, రక్తస్రావం జరుగుతుంది.
కేవలం పది నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చోవడం వల్లే ఈ ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.లోపల మీ సిస్టమ్ మాత్రం తీవ్రమైన ఒత్తిడికి గురవుతూనే ఉంటుంది. ఆ మొబైల్ మత్తులో మీరు మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ను పట్టించుకోరు. ఇక దీనివల్ల కండరాలు బలహీనపడి విసర్జన ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే టాయిలెట్ గదిలోకి ఫోన్ను తీసుకెళ్లడం మానేయండి. పది నిమిషాల లోపు మీ పని ముగించుకుని బయటకు రావడం ఉత్తమం. చిన్న మార్పే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ చిన్న అలవాటే మిమ్మల్ని హాస్పిటల్ పాలు చేయవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి.
