డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతికారమే అని షర్మిల అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య సాధింపు చర్య. పార్లమెంట్ లో సౌత్ ప్రాతినిథ్యం తగ్గించే కుట్రలో భాగం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పిన మాటలు అక్షర సత్యం. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేయడం అంటే.. కుటుంబ నియంత్రణ పాటిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లే. 1971 తర్వాత సౌత్ కంటే నార్త్ లోనే అత్యధిక జనాభా పెరిగింది. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే 8 కోట్ల నుంచి 24 కోట్ల జనాభా పెరిగింది.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం యూపీలో 80 నుంచి 143 సీట్లకు అదనంగా పెరుగుతున్నట్లే. బీహార్ లో 40 నుంచి 79 కి పెరిగే స్థానాలు కలుపుకుంటే.. రెండు రాష్ట్రాల నుంచే 222 ఎంపీలు పార్లమెంట్ లో ప్రాతినిథ్యం వహించే పరిస్థితి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పెరిగే సీట్లు 12 మాత్రమే. అంటే 42 నుంచి 54కి మాత్రమే. సౌత్ రాష్ట్రాల్లో పెరిగే సీట్లు పదుల సంఖ్యలో ఉంటే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య వందలాదిగా ఉంటోంది. డీ లిమిటేషన్ పై బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలి అని షర్మిల కోరారు.