రైలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే మనందరికీ వచ్చే మొదటి ఆలోచన “ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఎమర్జెన్సీ కోటాలో సీటు కన్ఫర్మ్ చేయించుకోవచ్చు” అని. కానీ, ఈ ఎమర్జెన్సీ కోటా అనేది మనం అనుకున్నంత సులభం కాదు. ఇది ప్రతి ప్రయాణీకుడికి అందుబాటులో ఉండే సాధారణ సదుపాయం అసలే కాదు. అసలు ఈ కోటా ఎవరి కోసం కేటాయించారు? దీనికి అర్హులు ఎవరు? ఈ సీట్లు ఎలా కన్ఫర్మ్ అవుతాయి? అన్న విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఎమర్జెన్సీ కోటా అంటే ఏమిటి?: రైల్వే పరిభాషలో దీన్ని ‘Headquarter Quota’ లేదా ‘EQ’ అని పిలుస్తారు. ప్రతి రైలులో కొన్ని సీట్లను అత్యవసర పరిస్థితుల కోసం రైల్వే శాఖ రిజర్వ్ చేసి ఉంచుతుంది. అయితే, చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు ఈ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయి. ప్రయాణానికి కొన్ని గంటల ముందు మాత్రమే వీటిని కేటాయిస్తారు. మీకు తెలుసా? ఈ కోటాలో సీటు కావాలంటే కేవలం వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే సరిపోదు, దానికి తగిన బలమైన కారణం మరియు సిఫార్సు కూడా ఉండాలి.
ఈ కోటాకు అర్హులు ఎవరు?: ఈ సీట్లు అందరికీ ఇవ్వరు. ఇవి ప్రభుత్వ ఉన్నతాధికారులు, విధుల్లో భాగంగా ప్రయాణించే గెజిటెడ్ ఆఫీసర్లు. ఇక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఇతర వీఐపీలు వీరికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.

అత్యవసర పరిస్థితులు: కుటుంబంలో ఎవరైనా మరణించినా లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా (మెడికల్ ఎమర్జెన్సీ) ఈ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పోతే, అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు సరైన ఆధారాలను (మరణ ధృవీకరణ పత్రం లేదా డాక్టర్ లెటర్) జత చేయాల్సి ఉంటుంది.
చాలామంది రాజకీయ నాయకుల సిఫార్సు ఉంటే సీటు కచ్చితంగా వస్తుందని అనుకుంటారు. అసలు విషయం ఏమిటంటే, సిఫార్సు లేఖ ఇచ్చినంత మాత్రాన సీటు కన్ఫర్మ్ కాదు. ఆ రోజు ఉన్న సీట్ల లభ్యతను బట్టి, ఉన్నతాధికారుల ప్రాధాన్యతను బట్టి రైల్వే జోనల్ ఆఫీస్ వారు నిర్ణయం తీసుకుంటారు. వీఐపీల కంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారికే రైల్వే శాఖ మొదటి ప్రాధాన్యత ఇస్తుంది.
ఎమర్జెన్సీ కోటా అనేది నిజంగా ఆపదలో ఉన్నవారికి ఒక వరం లాంటిది. దురదృష్టవశాత్తూ కొందరు దీన్ని వ్యక్తిగత ప్రయాణాల కోసం వాడుతుంటారు, కానీ నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయి. మీకు నిజంగా అత్యవసర పరిస్థితి వస్తే, సంబంధిత డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (DCM) కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చి ప్రయత్నించవచ్చు.
